‘గాంధీ’ లో 11 నెలల బాలుడు కిడ్నాప్‌

 హైదరాబాద్‌ : సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో 11 నెలల బాలుడు కిడ్నాప్‌కు గురైన ఘటన తీవ్ర కలకలం రేపింది. మౌలాలి ప్రాంతానికి చెందిన రాధిక అనే మహిళ కొద్ది రోజుల క్రితం గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన బంధువులను చూసేందుకు వచ్చారు. అప్పటి నుంచి ఇంటికి వెళ్లకుండా ఆస్పత్రిలోనే తన 11 నెలల కుమారుడితో కలిసి ఉంటున్నారు. రాధిక భర్త నేరం చేసిన కేసులో చంచల్‌ గూడ జైలులో ఉన్నారు. దీంతో రాధిక గాంధీ ఆస్పత్రిలోని వెయిటింగ్‌ రూమ్‌లో బాలుడితో కలిసి ఉంటున్నారు.










గురువారం తెల్లవారు జామున 4 గంటలకు గుర్తుతెలియన వ్యక్తులు బాలుడిని కిడ్నాప్‌ చేసి పరారయ్యారు. కాసేపటి తర్వాత నిద్రలేవగా పక్కన బాబు కనిపించలేదు. దీంతో ఆమె కంగారుపడిన ఆమె చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికినా బాలుడి ఆచూకీ లభించలేదు. దీంతో చిలకలగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల పుటేజీని పరిశీలిస్తున్నారు. అదృశ్యమైన సమయం సరిగ్గా చెప్పకపోవడంతో సీసీటీవీలో బాలుడి వీడియో పుటేజ్‌ దొరకడంలేదని చిలకలగూడ ఎస్సై రాజశేఖర్‌ గౌడ్‌ పేర్కొన్నారు. బాలుడు అదృశ్యమైన వీడియో దొరికితే తప్ప బాలుడిని పట్టుకోవడం కష్టమని చెప్పారు.