అమరావతి: ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు జనతా కర్ఫ్యూకి ఏపీ ఫెడరేషన్ ఆఫ్ పెట్రోలియం ట్రేడర్స్ (ఏపీఎఫ్పీటీ) మద్దతు ప్రకటించింది. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడం కోసం ఆదివారం ఉదయం 7.00 నుంచి రాత్రి 9.00 గంటల వరకు దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ విధించనున్నారు. ఆ రోజు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 3 వేల పెట్రోల్ బంకులను మూసి వేస్తూ సిబ్బందికి సెలవులు ప్రకటించినట్లు ఏపీఎఫ్పీటీ అధ్యక్షుడు రావి గోపాలకృష్ణ తెలిపారు. ప్రభుత్వ వాహనాలు, అంబులెన్స్ల కోసం ప్రతి పెట్రోల్ బంక్లో ఒకరిద్దరు సిబ్బందిని ఉంచుతున్నట్లు చెప్పారు.
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కోవిడ్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా రవాణా శాఖ ఏప్రిల్ 5వ తేదీ వరకు లెర్నింగ్ లైసెన్సు పరీక్షలను రద్దు చేసింది. ఈ మేరకు ఆ శాఖ కమిషనర్ పీఎస్సార్ ఆంజనేయులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్ 5 తర్వాత అప్పటి పరిస్థితిని బట్టి రద్దు నిర్ణయాన్ని పొడిగించాలా? లేదా? అన్నది పరిశీలిస్తామన్నారు. కార్యాలయాలకు వచ్చే సందర్శకుల సంఖ్య తగ్గించేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఉద్యోగులు జ్వరం, జలుబు, దగ్గు వంటి లక్షణాలతో బాధపడుతుంటే సెలవు తీసుకుని చికిత్స కోసం వెళ్లాలని స్పష్టం చేశారు.